వేటపాలెం పేలుడు విచారణ కమిటీ
బాధ్యులను గర్తించాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 24 మంది మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్, ఈగల్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. నెల రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఆదివారం (ఫిబ్రవరి 28వ తేదీ) పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 23 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుధాటికి మృతదేహాలు.. స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. మరో వైపు ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన లోవరాజు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 24కి చేరింది. ఈ ఘటనలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టపాసుల కేంద్రంలో 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి సైతం నగదును పరిహారంగా అందజేయనున్నట్లు వెల్లడించింది.
