సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ
గ్రామీణ స్థాయి నుంచే ఆరోగ్య వ్యవస్థను నిత్యం పర్యవేక్షిస్తేనే ఇటువంటి అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇటీవల జరిగిన కల్తీ పాలు ఘటనలో అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్న బాధితులను కిమ్స్ ఆసుపత్రిలో శనివారం పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈనెల 15న కల్తీ పాలు ఘటనపై ప్రజలు ఆసుపత్రుల్లో చేరినా, 19వ తేదీ వరకు ప్రభుత్వం సీరియస్గా స్పందించలేదని ఆయన విమర్శించారు. జిల్లా వైద్యశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, పాలకులు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు.
కల్తీ పాలు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు సరిపోవని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, వైద్యులతో మాట్లాడి ప్రమాద తీవ్రతపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అక్కినేని వనజ, తాటిపాక మధు, రేఖ భాస్కరరావు, కే. రాంబాబు, కే. సత్తిబాబు, ఎం. ప్రసాద్, నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కల్తీ పాలు బాధితులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలి:
RELATED ARTICLES
