భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన థగ్గీ వ్యవస్థకు చెందిన థగ్ బెహ్రామ్) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హంతకుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. పందొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని ప్రయాణికులను గజగజలాడించిన ఈ వ్యక్తి సుమారు 931 మందిని హత్య చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. 1840వ సంవత్సరంలో అతనికి ఉరిశిక్ష అమలు చేయబడింది. థగ్ బెహ్రామ్ కేవలం ఒక దొంగ మాత్రమే కాదు అతను ఒక రహస్య హంతక ముఠాకు నాయకుడు. ఆ కాలంలో ఈ థగ్గీలు ఒక వింతైన ఆచారాన్ని పాటించేవారు. వారు బాటసారులను నమ్మించి వారితో కలిసి ప్రయాణం చేసేవారు. సరైన సమయం చూసి తమ వద్ద ఉండే ఒక పసుపు రంగు వస్త్రాన్ని (రుమాలు) ఉపయోగించి బాధితుల గొంతు నులిమి చంపేవారు. ఈ ప్రక్రియలో వారు ఎక్కడా రక్తం చిందించకుండా జాగ్రత్త పడేవారు.
థగ్ బెహ్రామ్ సుమారు 1790 నుండి 1840 మధ్య కాలంలో ఈ ఘోరకృత్యాలకు పాల్పడ్డాడు. బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిపిన విచారణలో అతను స్వయంగా 931 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అతను స్వయంగా 125 మందిని చంపగా మిగిలిన హత్యలు అతని సమక్షంలో అతని ముఠా సభ్యులు చేశారని అంటారు. ఏది ఏమైనప్పటికీ ఒకే వ్యక్తి ఇన్ని హత్యలకు బాధ్యుడు కావడం అనేది ప్రపంచ నేర చరిత్రలో ఎక్కడా లేని విధంగా నమోదైంది. థగ్గీలు తాము చేసే ఈ హత్యలను ఒక సామాజిక నేరంగా కాకుండా తమ ఆరాధ్య దైవమైన కాళికా మాతకు సమర్పించే బలిగా భావించేవారు. బాధితుల నుండి సంపదను దోచుకోవడమే కాకుండా వారిని ఎవరికీ అనుమానం రాకుండా పాతిపెట్టడంలో వీరు ఆరితేరిన వారు.
బెహ్రామ్ తన ముఠా సభ్యులతో కలిసి ప్రయాణికుల నమ్మకాన్ని ఎలా చూరగొనాలో బాగా తెలిసినవాడు. వారు ఒక వ్యాపార బృందంలాగా లేదా యాత్రికుల గుంపులాగా బాటసారులను కలిసేవారు. రాత్రి పూట విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక్కసారిగా దాడి చేసి రుమాలతో గొంతు బిగించేవారు. ఈ పద్ధతిని వారు “ఫాన్సీగార్” అని పిలిచేవారు. బెహ్రామ్ తన రుమాలులో ఒక నాణేన్ని ఉంచి గొంతు బిగించే సమయంలో అది గొంతు ఎముకను నొక్కేలా చేసేవాడు. దీనివల్ల బాధితులు ఒక్క నిమిషం లోపే ప్రాణాలు కోల్పోయేవారు. ఈ గొంతు నులిమే పద్ధతి ద్వారా శవంపై ఎటువంటి గాయాలు ఉండవు కాబట్టి వారు సులువుగా తప్పించుకునేవారు.
బ్రిటిష్ అధికారి విలియం స్లీమన్ థగ్గీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. అనేక సంవత్సరాల పాటు సాగిన గూఢచారి వ్యవస్థ ద్వారా బెహ్రామ్ ను పట్టుకోవడం సాధ్యమైంది. 1840లో అతనిని పట్టుకున్నాక జరిగిన విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని వందల మందిని ఎలా చంపగలిగాడో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విచారణ తర్వాత థగ్ బెహ్రామ్ కు ఉరిశిక్ష విధించబడింది. దీంతో శతాబ్దాల పాటు సాగిన భయంకరమైన థగ్గీ శకం ముగిసింది. నేటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యంత భయంకరమైన హంతకుడిగా బెహ్రామ్ పేరు నిలిచిపోయింది. మానవ చరిత్రలో క్రూరత్వానికి ఇది ఒక పరాకాష్టగా మిగిలిపోయింది.
ఈ నేర చరిత్ర గురించి ఒక పరిశోధకుడు ఇలా అన్నాడు: “బెహ్రామ్ చేసిన హత్యలు కేవలం నేరాలు మాత్రమే కావు అవి ఒక వ్యవస్థీకృత రహస్య నెట్వర్క్ యొక్క శక్తిని సూచిస్తాయి, ఒక వ్యక్తి పట్ల సమాజం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ చరిత్ర మనకు నేర్పుతుంది, పట్టుదల ఉంటే ఎంతటి భయంకరమైన వ్యవస్థనైనా నిర్మూలించవచ్చని బ్రిటిష్ అధికారులు నిరూపించారు.”
(సి.హెచ్.ప్రతాప్)
