8 మంది ఉగ్రవాద ముఠా అరెస్టు
పాక్, బంగ్లా గ్రూపులు విధ్వంస ప్రణాళిక
అప్రమత్తమ చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో
తమిళనాడు, బెంగాల్, ఢిల్లీ పోలీసుల ఆపరేషన్
భారత గడ్డపై మరోసారి నెత్తురు పారించాలని చూసిన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్రను తమిళనాడు పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ , బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థల సహకారంతో భారత్లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన 8 మందిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని కీలక నగరాల్లో పేలుళ్లకు వీరు ప్లాన్ పన్నినట్లు నిఘా వర్గాల నుండి అందిన సమాచారంతో పోలీసులు ఈ మెరుపు దాడి నిర్వహించారు. ఢిల్లీ పోలీసులు తమిళనాడు, పశ్చిమ బెంగాల్కు చెందిన ఎనిమిది మందిని పాకిస్తాన్ కేంద్రంగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్న ఉగ్ర కుట్రకు లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆరుగురు మిజానూర్ రెహ్మాన్, మహ్మద్ శబాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ లను తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో దుస్తుల తయారీ యూనిట్ల నుంచి అరెస్ట్ చేశారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరు బంగ్లాదేశ్ పౌరుడని అధికారులు భావిస్తున్నారు.
అధికారులు గుర్తించిన సమాచారం ప్రకారం, ఆరుగురు వ్యక్తులు ఉతుకూలి (ఇద్దరు), పల్లడం (ముగ్గురు), తిరుమురుగన్పూండి (ఒకరు) లలో దుస్తుల ఫ్యాక్టరీలలో నకిలీ ఆధార్ కార్డులను సబ్మిట్ చేసి తమ గుర్తింపును దాచిపెట్టి పని చేస్తున్నారు. ఉగ్రదాదులకు కుట్ర జరుగుతుందని నిఘా వర్గాల సమచారంతో చేపట్టిన ఆపరేషన్ లో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిందితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, పలు నగరాల్లో నిఘా నిర్వహించడం వంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారని సమాచారం. వారి కార్యకలాపాల్లో భాగంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ కాశ్మీర్ పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ కోసం రైలులో ఢిల్లీకి తీసుకువచ్చారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా జాతీయ రాజధానిలోని ఎర్రకోట, చాందినీ చౌక్లోని మతపరమైన ప్రదేశాలతో సహా ప్రముఖ ప్రదేశాలపై దాడులకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో తమిళనాడులో ఉగ్రకుట్రకు లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో నిందితులను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు గుర్తించి హెచ్చరించడంతో భద్రతా సంస్థలు ఢిల్లీవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా (LeT) భారీ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో ప్రధాన దేవాలయాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
