అక్రమాలు ప్రభుత్వ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం*
*క్రిస్టియన్ భవన్ కు రూపాయి కూడా జగన్ ఖర్చు చేయలేదు*
*క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం*
రాష్ట్రంలో క్రైస్తవ ఆస్తులు ప్రభుత్వ పరిధిలోకి రావని, అయితే ఆక్రమణలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ప్రభుత్వ దృష్టికి తెస్తే, అమలులో ఉన్న చట్టాలమేరకు జిల్లా కలెక్టరు, ఇతర సంబంధిత అధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఫరూక్ సమాధానం ఇచ్చారు. క్రైస్తవ సంస్థల నుండి వ్యతిరేకత వచ్చిన తర్వాత క్రైస్తవ ఆస్తులపై ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి ఫరూక్ సమాధానం ఇస్తూ ఇజ్రాయిల్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఇక్కడి నుండి అక్కడికి యాత్రికులను పంపే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం గత టిడిపి ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి, రూ.20 కోట్లు నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ క్రిస్టియన్ భవన నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఐదేళ్లలో ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. తానేమో క్రిస్టియన్ అని జగన్ చెప్పుకుంటాడని.. నాకైతే తెలియదు గానీ జగన్ క్రిస్టియన్ కాదేమో ననుకుంటున్నానని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరులో క్రిస్టియన్ భవన్, కడపలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని పూర్తి చేసే బాధ్యత విస్మరించాడని మంత్రి ఫరూక్ ధ్వజమెత్తారు. 2014-2019 లో చర్చిలకు రూ. 90 కోట్లు ఇవ్వడం జరిగిందని,అయితే 2019 -2024 లో కేవలం రూ. 4.12 కోట్లు జగన్ ఇచ్చారన్నారు. దీన్ని బట్టి క్రైస్తవుల పట్ల ఎవరికి అభిమానం ఉందో స్పష్టం అవుతుందని మంత్రి అన్నారు. మన ప్రభుత్వం- మన బాధ్యతగా భావించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తికి కట్టుబడి ఉందని, పూర్తి చేస్తామని మంత్రి ఫరూక్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పేర్కొన్నారు.*
