వీఎంఆర్డిఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పిలుపు ,అంతర్జాతీయ పర్యాటకులకు ఆత్మీయ ఆతిధ్యం అందేలా అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్లు పిలుపునిచ్చారు. వీఎంఆర్డిఏ కార్యాలయంలో గురువారం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖలో జరుగనున్న అంతర్జాతీయ నౌకల సమీక్ష సందర్భంగా చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగమైన రైలు ఓవర్ బ్రిడ్జి, కైలాసగిరిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న త్రిశూల్, ఢమరుకం నిర్మాణ ప్రాజెక్టుల ప్రగతిని అలాగే బృహత్తర ప్రణాళిక సవరణ తదితర అంశాలపై సమీక్షించారు. మ్యూజియంలలో దాదాపు అన్ని పనులూ దాదాపు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మరణించిన ఇద్దరు తోటమాలీలకు చెరో రూ. 3 లక్షల చొప్పున చెక్లను అందజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేష్, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదన్రావు, ప్లానింగ్ అధికారులు, పరిపాలనాధికారులు పాల్గొన్నారు.
