దివంగత గాన గంధర్వుడు ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో ప్రత్యేక స్మారక కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నటుడు, ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర ఆధ్వర్యంలో మిత్రమండలి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో జర్నలిస్టు–దర్శకుడు సత్య తెరకెక్కించిన లఘు చిత్రం ‘ఆపరేషన్ 1972’ చిత్ర బృందాన్ని ఘనంగా సత్కరించారు.
గత నెల 30న తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో యాంటీ డ్రగ్ అవగాహన అంశంపై రూపొందిన ‘ఆపరేషన్ 1972’ ప్రథమ బహుమతి సాధించిన విషయం తెలిసిందే. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు, యువజీవితాలు ఎలా దెబ్బతింటాయో హృదయాన్ని హత్తుకునే విధంగా చిత్రంలో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సత్య దర్శకత్వం వహించగా, డీఎస్ రావు సహదర్శకత్వం నిర్వహించారు.
కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అను శ్రీ అత్తిలి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక తదితరులు హాజరయ్యారు. ఘంటసాల గానాలతో స్మరణాంజలి ఘ టించిన అనంతరం చిత్ర బృందాన్ని సత్కరించారు.
ఈ సందర్భంగా అత్తిలి సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగకరమైన సందేశాన్ని అందించిన దర్శకుడు సత్యను అభినందించారు. నర్సిపల్లి హారిక మాట్లాడుతూ, యువతను సరైన దారిలో నడిపించే చిత్రమిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
‘ఆపరేషన్ 1972’ చిత్ర బృందానికి ఘన సత్కారం
RELATED ARTICLES
