భీమిలి రోడ్ల విస్తరణపై త్వరితగతిన నివేదిక,ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక అసోసియేషన్లకు అప్పగించడం ద్వారా పార్కులను.. సీఎస్ఆర్ నిధులతో స్మశానాలను.. అభివృద్ధి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జీవీఎంసీ మధురవాడ, భీమిలి జోన్ల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు జోన్లలో ఉన్న పార్కులు, ఓపెన్ స్పేస్ లు, స్మశానాల సమాచారం, అక్కడున్న సమస్యలపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక లేకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ కోసం గోతులు తవ్వడం వల్ల అస్తవ్యస్త స్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి బీచ్ రోడ్డు, మెయిన్ రోడ్డు, తగరపువలస రోడ్డు విస్తరణ వల్ల ఎన్ని కట్టడాలు పోతున్నాయనేది నివేదిక సిద్ధం చేయాలన్నారు. గతంలో భీమిలి – తగరపువలస రోడ్డు విస్తరణ కోసం 150 అడుగుల ఆర్డీపీ తయారు చేసినప్పటికీ, 80 అడుగులకు పరిమితం చేయాలని స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు తెలియజేశారు. ఎండాడ రైతుబజార్ కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని.. నిర్మాణంలో ఉన్న సాగర్ నగర్ – ఎండాడ రోడ్డు మధ్యలో అడ్డంకులు తొలగించాలని ఎమ్మెల్యే చెప్పారు. భీమిలిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని.. వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ లేకపోవడంతో క్లోరినేటెడ్ నీటినే తాగాల్సి వస్తుందని స్థానిక నాయకులు ఫిర్యాదు చేయగా.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. చిల్లపేట చెరువు, ఎండాడ చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ సహా సుందరీకరణ పనుల డిజైన్లు తయారు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపాలను గుర్తించి పూర్తి చేయాలని, తగరపువలసలో కళ్యాణ మండపం కోసం స్థలాన్ని అన్వేషించాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా బీచ్ రోడ్డులో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. గంట స్తంభం దగ్గర మార్కెట్ వివాదాన్ని పరిష్కరించాలని, లైట్ హౌస్ ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జోనల్ కమిషనర్లు వి. అయ్యప్ప నాయుడు, నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, మొల్లి లక్ష్మణరావు, మాన్యాల సోంబాబు, కె.అచ్యుతరావు, లొడగల జానకిరామ్, కొప్పల రమేష్, తమ్మిన సూరిబాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, పాసి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
