రాజమండ్రి సిటీ, కంబాల చెరువు దండి మార్చ్ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద మద్యం బాటిళ్లు పెట్టిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా స్పందించారు. గణతంత్ర దినోత్సవం మరుసటి రోజునే ఈ దారుణం చోటుచేసుకోవడం దేశ గౌరవానికి అవమానమని ఆయన మండిపడ్డారు. ఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న భరత్, గంటన్నర గడిచినా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో పాటు ప్రజాప్రతినిధులు సమీపంలో ఉన్నా చర్యలు లేకపోవడం కూటమి ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనమని విమర్శించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
