డయల్ 112 కాల్కు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడిన ఘటన జిల్లావ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నర్వా విశ్వతేజ (20), వెంకటేశ్వర నగర్, మోరంపూడి, రాజమండ్రి నివాసి. సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసిక ఆందోళనకు లోనైన విశ్వతేజ తన స్నేహితుడికి వీడియో పంపి గోదావరి నదిలోకి దూకాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే మరో స్నేహితుడు నక్కా శ్రీనివాస్ 112కు సమాచారం అందించాడు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్ విశ్వం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్విమ్మర్లు, పడవను సమీకరించి వేగవంతమైన చర్యలు చేపట్టారు. ఫలితంగా యువకుడిని సురక్షితంగా రక్షించి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ 112 సిబ్బంది, కొవ్వూరు టౌన్ పోలీసుల సమన్వయం వల్ల అమూల్యమైన ప్రాణం కాపాడబడిందని పేర్కొంటూ సంబంధిత అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
