నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపణలు
రాజమహేంద్రవరం నగరంలోని వైసీపీ మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అన్ని బ్రాండ్లపై అక్రమంగా రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. గురువారం అన్నపూర్ణమ్మపేట నాయిబ్రాహ్మణ రామాలయం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రూ.99 మద్యం బ్రాండ్లు, కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల మినహా మిగతా వాటిపై మాత్రమే రూ.10 వసూలు చేయవచ్చని తెలిపారు. కానీ నగరంలోని వైసీపీ మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం నాయకులపై మద్యం సిండికేట్ అంటూ దుష్ప్రచారం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ వ్యాపారుల అక్రమాలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నగర జనాభాను అధికంగా చూపి ఒక్కో షాపుకు రూ.85–90 లక్షల ఫీజులు వసూలు చేయడంతో వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉపశమనంతో వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయని తెలిపారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపర్తి శ్రీనివాసు ,కొల్లి బుజ్జి, శనపతి సత్తిబాబు, కిలపర్తి భూషణం, దాస్యం ప్రసాద్, ముసిని బాబురావు, బంగారు నాగేశ్వరరావు, చాపల చిన్ని, ఈతలపాటి రవి, రఘు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
