Home Politics Andhra Pradesh దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం

0

జగన్ తప్పు చేసారని ఎప్పుడూ చెప్పలేదు

టీటీడీ బోర్డుదో పూర్తి బాధ్యత

దోషులను వైసీపీ అధినేత సమర్థించడం సరికాదు

హిందువుల మత విశ్వాశాలకు విఘాతం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

అసెంబ్లీలో ఉద్యేగ పూరిత ప్రసంగం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా దీనిని పరిగణించాలని ఆయన సభలో పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ప్రధానంగా గత టీటీడీ బోర్డు వైఫల్యాలను ఎత్తిచూపారు. నేను ఎక్కడా వ్యక్తిగతంగా వైఎస్ జగన్ తప్పు చేశారని చెప్పలేదు, కానీ ఆనాటి టీటీడీ బోర్డుదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయినప్పుడు దానిని అంగీకరించి తప్పు సరిదిద్దుకోకుండా, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం శోచనీయమని మండిపడ్డారు. రూ. 400 లకే స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుందని నమ్మడం సాధ్యం కాదని, కనీసం నువ్వుల నూనె కూడా ఆ ధరకు దొరకదని ఆయన ఎద్దేవా చేశారు. ల్యాబ్ రిపోర్టులు, సిట్ విచారణ అంశాలను ప్రస్తావిస్తూ, లడ్డూ తయారీకి వాడినది అసలు నెయ్యే కాదని, అది పామాయిల్ , రసాయనాల మిశ్రమమని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా చెప్పలేదని, ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రసాయనాలతో తయారు చేసిన ఈ ద్రవాన్ని ప్రసాదంగా వినియోగించడం వల్ల భక్తుల ఆరోగ్యం మరియు విశ్వాసం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అపచారం కేవలం తిరుమలకే పరిమితం కాలేదని, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు కూడా ఇక్కడి నుంచే కల్తీ లడ్డూలు పంపారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను మేం చూస్తూ ఊరుకోం. వేరే మతాలకు ఇలాంటి అన్యాయం జరిగితే ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టేవారు, మరి హిందువుల విషయంలో ఎందుకు మౌనం? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. భగవంతుడి విషయంలో అపచారాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడతారని పవన్ హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద లోని పద్యాన్ని ఉటంకిస్తూ, పాలకులకు ధర్మం పట్ల ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version