ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చేది కూటమి ప్రభుత్వం-డైరీ ఆవిష్కరణలో మంత్రులు గొట్టిపాటి , ఎన్ఎండి ఫరూక్ ముస్లిం, మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ 2026 ను అమరావతిలోని సచివాలయంలో సహచర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తో కలిసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., ఉద్యోగ సంఘం నేతలు తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చేది కూటమి ప్రభుత్వమేనని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ బోర్డును మొదటిసారి ఏర్పాటు చేసింది తెలుగు దేశం ప్రభుత్వమే అన్నారు. అదే విధంగా ముస్లింలకు, ఇతర మైనారిటీలకు కూటమి ప్రభుత్వంలోనే రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడో పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న సంస్కరణలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కడపలో జరిగిన ఇస్తమా వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.1.25 కోట్లు విడుదల చేసిందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలతో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
