ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సోలార్ సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయ ప్రాంతమంతా భద్రతా వలయంలోకి తీసుకున్నారు. స్నాన ఘాట్లు, ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద తెల్లవారుజాము నుంచే లా అండ్ ఆర్డర్, సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ వాహనాల రాకపోకలను సమర్థంగా నియంత్రిస్తున్నారు. ఆలయం సమీపంలో ఇంటిగ్రేటెడ్ అవుట్పోస్ట్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని నిమిషానికోసారి పర్యవేక్షిస్తున్నారు.
జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా గాలిమార్గంలోనూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించి సూచనలు పాటించాలని అధికారులు కోరారు.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాటు
RELATED ARTICLES
