Home Politics Andhra Pradesh జనసేన ఆఫీసులో ఉద్రిక్తత

జనసేన ఆఫీసులో ఉద్రిక్తత

0

రెండు కార్లపై ఓ వ్యక్తి దాడి

ధ్వంసమైన వాహనాలు

అప్రమత్తమైన పోలీసులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి హఠాత్తుగా కార్యాలయం లోపలికి చొరబడి, అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లపై రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా కార్ల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేయడంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రి గా గుర్తించారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేక ఈ పని చేశాడా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పార్టీ కార్యాలయం వంటి కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశంలోకి ఒక వ్యక్తి రాడ్డుతో చొరబడి వాహనాలను ధ్వంసం చేయడంపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడి జరిగిన సమయంలో కీలక నేతలు ఎవరైనా కార్యాలయంలో ఉన్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు నీలాద్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడు ఏ ఉద్దేశంతో మంగళగిరి వరకు వచ్చాడు? ఈ దాడికి పురికొల్పిన కారణాలు ఏంటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలను కార్యాలయం వద్ద మోహరించి భద్రతను పటిష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version