స్థానిక 46వ డివిజన్ రామదాసుపేటలోని మున్సిపల్ పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం అమలులో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని కోరిన ఆయన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
