Home Politics Andhra Pradesh పాపులేషన్ మేనేజమెంట్ పాలసీని వెంటనే ఆపండి

పాపులేషన్ మేనేజమెంట్ పాలసీని వెంటనే ఆపండి

0

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో దేశంలోనే 36వ స్థానంలో ఉందని, యువతలో 18 శాతం నిరుద్యోగంతో కొనసాగుతుందని,అత్యున్నత విద్య, వైద్యం, వసతి కోట్లాది మంది కి అందుబాటులో లేని పరిస్థితుల్లో మరింత మంది పిల్లలను కనండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 5వ తేదీన శాసన సభల్లో ప్రకటిస్తూ పాపులేషన్ మేనేజమెంట్ పాలసీని పేర్కొనడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈనెల 6వ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పాపులేషన్ మేనేజమెంట్ పాలసీని వెంటనే రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా పేద ప్రజల అభ్యున్నతి దృష్ట్యా వెంటనే రద్దు చేయాలని కోరారు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ముస్లిం జనాభా వేగంగా పెరుగుతుందని, హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరటం, మరోవైపు కొంత మంది రాజకీయ నేతలు దక్షిణాది రాష్ట్రాలలో జనాభా వేగంగా పెరగకపోవడం వలన ఉత్తరాది రాష్ట్రాలలో రాబోవు డీలిమిటేషన్ ద్వారా లోక్ సభ సభ్యులు అధికంగా పెరుగుతారని కావున దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలు అధికంగా పిల్లలను కనాలనే ఆలోచనలు తప్పుడు ఆలోచనలు అని సమాజంలో తిరోగమన చర్యగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అభివర్ణించారు . సంతాన ఉత్పత్తి రేటు బీహార్ లో 3, ఉత్తర ప్రదేశ్ లో 2.4, జార్ఖండ్ లో 2.3 గా ఉండడం వలన జనాభా అధికంగా పెరుగుతూ నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని దక్షిణాది రాష్ట్రాలలో మహిళ సంతాన ఉత్పత్తి రేటు1.7 లోపు ఉండటం వలన వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ మేనేజమెంట్ పాలసీ ద్వారా ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ను నిలపాలని భావించడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జపాన్, కొరియా, జర్మనీ లాంటి దేశాలతో పోల్చుతూ ఆయా దేశాలలో సంతాన ఉత్పత్తి రేటు ఒకటి లోపుగా ఉండటం వలన వృద్ధుల జనాభా పెరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ఆ స్థితికి రాకూడదని భావిస్తున్నారని తెలుపుతూ జపాన్ 100 శాతం అక్షరాస్యతతో 36వేల డాలర్ల తలసరి ఆదాయంతో ఉందని, దక్షిణ కొరియా 100 శాతం అక్షరాస్యత 56 వేల డాలర్ల తో కొనసాగుతుందని జర్మనీ 100 శాతం అక్షరాస్యత 64 వేల డాలర్ల తలసరి ఆదాయంతో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేవలం 70 శాతం అక్షరాస్యతతో 3 వేల డాలర్ల తలసరి ఆదాయంతో, యువతలో 18 శాతం నిరుద్యోగంతో, కోట్లాది మంది పేద ప్రజలతో కొనసాగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుని మరింత మంది పిల్లలను కనమని పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పాపులేషన్ మేనేజమెంట్ పాలసీ భావనకు స్వస్తి పలికి ప్రజలందరికీ రక్షిత మంచినీరు, ఉపాధి ఉద్యోగాలు, అత్యున్నత విద్య, అత్యున్నత వైద్యం అందించే వైపు దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పాపులేషన్ మేనేజమెంట్ పాలసీని ముందుకు తీసుకుని వెళ్లాలని భావిస్తే జన చైతన్య వేదిక ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సదస్సులు, చర్చా గోస్టులు నిర్వహించి ప్రజలను జాగృతులను చేసి ఉద్యమిస్తామని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version