Home Politics Andhra Pradesh జ్యోతిష్యం పేరిట 58 మహిళలపై లైంగిక దాడి..!

జ్యోతిష్యం పేరిట 58 మహిళలపై లైంగిక దాడి..!

0

` నిందితుడిని నాసిక్‌లో అరెస్టు చేసిన పోలీసులు

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ కీచక జ్యోతిష్యుడి గుట్టురట్టయింది. జ్యోతిష్యం, వాస్తు పేరుతో మహిళలను లోబర్చుకుని, లైంగికంగా దోపిడీ చేస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు, రిటైర్డ్ మర్చంట్ నేవీ అధికారి అశోక్ ఖారట్ (67) అలియాస్ ‘కెప్టెన’ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కార్యాలయంలో 58 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్ లభించడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. వివరాల్లోకి వెళితే, నాసిక్‌లోని కెనడా కార్నర్ ప్రాంతంలో అశోక్ ఖారట్ ‘ఓకస్ ప్రాపర్టీ డీలర్స్ అండ్ డెవలపర్స’ పేరుతో కార్యాలయం నడిపేవాడు. తనను తాను ‘కెప్టెన’ అని, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకునేవాడు. వివాహ సమస్యలతో బాధపడుతున్న 35 ఏళ్ల మహిళ ఒకరు 2022లో ఇతడిని సంప్రదించింది. ఆమె భర్తకు ప్రాణగండం ఉందని, ప్రత్యేక పూజలతో దానిని నివారిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, హిప్నటైజ్ చేసి, భయపెట్టి 2025 డిసెంబర్ వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, కారట్ ఫార్మ్‌హౌస్‌పై దాడి చేసి చాకచక్యంగా అతడిని అరెస్టు చేశారు. ఈ సోదాల్లో ఒక పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని కార్యాలయంలో రహస్యంగా అమర్చిన సీసీటీవీ కెమెరాలను గుర్తించారు. అక్కడ లభించిన ఒక పెన్‌డ్రైవ్‌లో 58 మంది వేర్వేరు మహిళలపై లైంగిక దాడి చేస్తున్న వీడియోలు ఉండటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. మత్తుమందులు, చేతబడి వంటివి ప్రయోగించి మహిళలను లొంగదీసుకుని, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో ఖారట్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకణ్‌కర్‌పై కూడా విమర్శలు రావడంతో ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం ఐపీఎస్ అధికారిణి తేజస్వినీ సత్పుతే నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు వీడియోలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపి, ఇతర బాధితులను గుర్తించే పనిలో పడ్డారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 (రేప్), బ్లాక్ మ్యాజిక్ చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరచగా మార్చి 24 వరకు కస్టడీకి అప్పగించారు. సిట్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version