ఐఎఫ్ఆర్ లో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి, సమీక్షించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ , భాగస్వామ్యమైన నేవీ, జిల్లా అధికారులుఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్టణం వేదికగా జరగనున్న ఐఎఫ్ఆర్ -2026, మిలాన్ విలేజ్ కార్యక్రమాలను, రాష్ట్రపతి పర్యటనను సమన్వయంతో విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంలోని వివిధ విభాగాల అధికారులు, పోలీసు, రక్షణ శాఖ అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం సమీక్షించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రపతి పర్యటనను అత్యంత భద్రతతో, ప్రోటోకాల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యుత్ పవర్ బ్యాకప్, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, పీఏ సిస్టమ్, బ్యారికేడింగ్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు, కాన్వాయ్ వాహనాల నిర్వహణ, ప్రజల రవాణా సౌకర్యాలు, తాగునీరు, క్యూలైన్, విశ్రాంతి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్దేశించారు. సాంస్కృతిక, జానపద, సంప్రదాయ నృత్య బృందాల ప్రదర్శనలు, మార్చింగ్ కంటింజెంట్ నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. మిలాన్ విలేజ్, క్రూయిజ్ టెర్మినల్ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ చెత్త సేకరణ, శుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ఐఎఫ్ఆర్, మిలాన్ కార్యక్రమాలు జరిగే సమయంలో సముద్రంలో ప్రయివేటు బోట్ల రాకపోకలు, చేపల వేట వంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. అతిథుల రాకపోకలు, పర్యాటక ప్రాంతాల సందర్శన, దేవాలయ సందర్శన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేయాలని సూచించారు.సుందరీకరణ పనులు పూర్తి చేయాలి,ఐఎఫ్ఆర్, మిలాన్ -2026 కార్యక్రమాల నేపథ్యంలో నగర పరిధిలోని పార్కులు, ప్రధాన రహదారుల్లో సుందరీకరణ పనుల చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలను సుందరీకరించాలని, అభివృద్ధి పనులేమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐఎన్ఎస్ డేగా నుంచి మారుతీ జంక్షన్ వరకు రోడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ వంతెను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. సంకల్ప్ విలేజ్ సందర్శన ఉన్న నేపథ్యంలో పినగాడి – వేపగుంట రోడ్డు పనులను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. పోర్టు, హెచ్పీసీఎల్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఎన్.హెచ్.ఏ.ఐ. పరిధిలో చేపట్టాల్సిన సివిల్ వర్కులు, సుందరీకరణ పనులను వాయువేగంతో పూర్తి చేయాలని కలెక్టర్ నిర్దేశించారు.ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూ, 19న మిలాన్, సిటీ పరేడ్,అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయని, దీనికి దేశ, విదేశాల నుంచి 73 మంది అతిథులు విచ్చేస్తున్నారని నేవీ కమోడర్లు అమీ మాథ్యూ, రజనీష్ శర్మ తెలిపారు. 22 దేశాల నుంచి షిప్ లు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వారు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు మిలాన్ విలేజ్ కార్యక్రమం కొనసాగుతుందని, 18న రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 19న సిటీ పరేడ్ తో పాటు, మిలాన్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. 19, 20వ తేదీల్లో మిలాన్ హార్బర్ ఫేజ్ ఉండగా, 21 నుంచి 25వ తేదీల వరకు సీ ఫేజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరకానుండగా, మిలాన్ విలేజ్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వ్యవహరించి ప్రారంభోత్సవం చేయనున్నారని వివరించారు. ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు భాగస్వామ్యం కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నేవీ ఉన్నతాధికారులతో పాటు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీ మణికంఠ చందోలు, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
