111 మంది బాధితులకు రూ. 87 లక్షలు పంపిణీ
– ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
విశాఖ నగరంతో పాటు చోడవరం నర్సీపట్నం మాడుగుల నియోజకవర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే వేపగుంట – పినగాడి రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం అని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు , పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. వేపగుంట – పినగాడి రోడ్డులో స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరహారం చెక్కులను, వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూశారని గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి ప్రాధాన్యతగా వేపగుంట పినగాడి రోడ్డును ఎంచుకుని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణానికి కషి చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా ఈ రోడ్డు నిర్మాణంలో వి.ఎం.ఆర్.డి.ఏ కమిషనర్ తేజ్ భరత్ పాత్ర ఎంతో ప్రముఖమైనదని, ఈ రోడ్డును పూర్తి చేయడానికి ఆయన ఎంతో ఉత్సాహంగా పని చేశారని గుర్తు చేశారు. అలాంటి అధికారులు ఉంటే ఎలాంటి పని అయినా సులభంగా పూర్తి చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం 111 మంది లబ్ధిదారులకు రూ. 87 లక్షల రూపాయలు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా యాజమాన్యం హక్కుల మేరకు అందరికీ పరిహారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి.ఎ. అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ భవాని శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధీర్ కుమార్, మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, ప్లానింగ్ అధికారులు,వారి సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

