సమాజానికి మంచి సందేశం: ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశంసలు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీకి మద్దతుగా నిలవడం అభినందనీయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల మేడారం జాతరలో కోవా బన్లు విక్రయిస్తున్న వలీని ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అనవసరంగా ప్రశ్నిస్తూ, నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిన ఘటన తెలిసిందే. ఆధార్ కార్డు చూపించాలని, పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తూ అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి. తాను అమ్ముతున్న బన్ నాణ్యమైనదేనని నిరూపించేందుకు వలీ అదే అక్కడ తిని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనపై స్పందించిన నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా వలీకి అండగా నిలుస్తామని, త్వరలోనే కలసి కోవా బన్ రుచి చూస్తానని ప్రకటించారు. సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం మన తెలుగు సమాజం విలువలని ఆయన పేర్కొన్నారు.
లోకేష్ స్పందనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. “చిరు వ్యాపారికి అండగా నిలబడి మంచి పౌర సంస్కృతికి దారితీశారు. కులమతాలకు అతీతంగా సమాజం ముందుకు సాగాలని లోకేష్ స్పష్టమైన సందేశం ఇచ్చారు” అని ఆయన అన్నారు.
