ప్రచారం ఖర్చుతో రెండు మెడికల్ కాలేజీల నిర్మించవచ్చు
*పాస్ బుక్ ల పంపిణీ కార్యక్రమంలో గంటా విమర్శలు*
క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో హద్దులు సహా మొత్తం భూమి వివరాలు తెలిపే పాస్ బుక్ ను రాజముద్రతో ప్రభుత్వం అందిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో మంగళవారం నవీకరించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఆయన రైతులకు పంపిణీ చేశారు. పొరపాట్లు లేని పాస్ పుస్తకాలను ఆయా భూ యజమానులకు ప్రతి నెల అందిస్తున్నామన్నారు. వైసీపీ హయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని పేర్కొన్నారు. పట్టాదార్ పాస్ బుక్ లు, సర్వే రాళ్ల పై ఫోటోల కోసం జగన్మోహన్ రెడ్డి రూ. 700 కోట్ల వృధా ఖర్చు చేశారని, ఆ సొమ్ముతో 2 మెడికల్ కాలేజీలు, 10 హైస్కూల్స్ నిర్మించవచ్చని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూమి పత్రాలంటే రైతులకు సెంటిమెంట్ అని, జగన్ వారి భావోద్వేగాలతో పరిహాసమాడారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆలస్యం కాకుండా జీతాలివ్వడం సహా రూ. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని వెల్లడించారు. బోని, ముచ్చర్ల, శిర్లపాలెం తదితర గ్రామాల్లో ఇనాం సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మార్వో ఎస్.సూరిబాబు, ఎంపీడీఓ జానకి, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, బలిరెడ్డి మల్లికార్జునరావు, కంటుభుక్త రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, లొడగల వెంకట్రావు, కాకర రమణ, కర్రి శ్రీనివాస్, మహంతి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
