Home Politics Andhra Pradesh కావూరి కన్నుమూత

కావూరి కన్నుమూత

0

కేంద్ర మంత్రిగా బాధ్యతలు

ఐదు సార్లు ఎంపీగా ప్రాతనిధ్యం

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ రాజకీయబంధం

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఆయన మృతిపై సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన మీడియాలో కథనాలు రాగా, కుటుంబసభ్యులు వాటిని ఖండించారు. అయితే పరిస్థితి విషమించడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం రాత్రి కావూరి కన్నుమూశారు. కావూరి సాంబశివరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండి 1984, 1989, 1998 లోక్ సభ ఎన్నికల్లో, ఏలూరు నియోజకవర్గం నుండి 2004, 2009లో గెలుపొందారు. కావూరి 8, 9, 12, 14, 15 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా సేవలు అందించారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం టీడీపీతో సన్నిహితంగా వ్యవహరించిన ఆయన తరువాత బీజేపీలో చేరారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కావూరి సాంబశివరాలు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని’ ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడ: మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాదవ్ విచారం వ్యక్తం చేశారు. 5 సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా కావూరి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. రాజకీయంలో వారికున్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై పార్లమెంటులోనూ, బయటా తన గళాన్ని వినిపించిన నేత. కావూరి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమైక్యాంధ్రకు బలమైన మద్దతుదారుడిగా కావూరి గుర్తింపు పొందారు. 2013-14లో తెలంగాణ ఏర్పాటు సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని సమైఖ్యాంధ్ర కోసం గట్టిగా తన వాదన వినిపించిన నేతల్లో కావూరి ఒకరి. తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు (కానీ తర్వాత అలాగే కొనసాగారు). ఉమ్మడిగానే రాష్ట్రాన్ని ఉంచాలని, ముక్కలు చేయడం ద్వారా ఓ ప్రాంతానికి నష్టం జరుగుతుందని గళం విప్పారు. కావూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థిరమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆరోగ్య కారణాల వల్ల ఇటీవలి కాలంలో వీల్‌చైర్‌లో కనిపించారు. రాజకీయాల్లోకి రాకముందు కావూరి సాంబశివరావు ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసి పారిశ్రామికవేత్తగా రాణించారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థను స్థాపించి మౌలిక సదుపాయాల రంగంలో కీలక ప్రాజెక్టులు చేపట్టారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version