2024లో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో సంచలనం రేపిన రౌతు కస్తూరి గ్యాంగ్ రేప్ & హత్య కేసులో న్యాయం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..
బుర్రిలంక గ్రామానికి చెందిన వివాహిత రౌతు కస్తూరి 2024 అక్టోబర్ 15న నర్సరీ పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం కలిగి, తదుపరి రోజు కడియం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 17న కస్తూరి మృతదేహం చొప్పెల్ల లాకులు వద్ద లభించింది. అనంతరం కేసును హత్యగా మార్చి పోస్ట్మార్టం నిర్వహించారు.
నిందితుల దారుణం
పోలీసుల విచారణలో నిందితులు నర్సరీలో మద్యం సేవిస్తున్న సమయంలో ఇంటికి వెళ్తున్న కస్తూరిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి కాలువలో పడేసినట్లు వెలుగులోకి వచ్చింది.
అరెస్టులు, ఛార్జ్ షీట్
సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో నలుగురు నిందితులను అక్టోబర్ 30, 2024న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అనంతరం పక్కా సాక్ష్యాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
కోర్టు తీర్పు
8వ అదనపు జిల్లా న్యాయస్థానం వాదోపవాదాల అనంతరం మార్చి 16, 2026న నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ. 2000 జరిమానా, చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
దర్యాప్తు బృందానికి అభినందనలు
ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఏపీపీ కె. రాధాకృష్ణ రాజు, డీఎస్పీ భవ్య కిషోర్, ఎస్ఐ నాగదుర్గ ప్రసాద్, సీఐ వెంకటేశ్వరరావు సహా పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు.
బుర్రిలంక సంచలన కేసులో న్యాయం… నలుగురికి జీవిత ఖైదు
RELATED ARTICLES
