సాగర నగరాన.. యద్ధనౌకల కాంతులు
ఐఎఫ్ ఆర్, మిలాన్ కు ముస్తాబైన విశాఖ
70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు
హాజరుకానున్న రాష్ట్రపతి మర్ము, గవర్నర్, సీఎం
విశాఖ సాగర తీరం ప్రపంచ యుద్ధ నౌకాదళ ఉత్సవానికి సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలన్ 2026, నేవీ చీఫ్ల కాన్ క్లేవ్కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. ఫిబ్రవరి 18న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఫ్లీట్ రివ్యూ-2026), 19న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్, 20న ‘ఐయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన దేశంలో ఉన్న యుద్ధనౌకల శక్తి సామర్థ్యాలను ఒకచోట సమీక్షించడాన్నే ఫ్లీట్ రివ్యూ అంటారు. ప్రతి ఏటా రాష్ట్రపతి ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు ఈ సమీక్ష నిర్హహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతర కాలంలో సముద్ర రక్షణ రంగ సామర్థ్యాలు ప్రదర్శించడానికి, ఇతర దేశాల నౌకా దళాలతోనూ సంబంధాలు బలపర్చుకునేందుకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ఎదిగింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నావికా సిబ్బందితో బీచ్ రోడ్డులో ప్రత్యేక పరేడ్ను నిర్వహిస్తారు. భాగస్వామ్య దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖ చేరుకుంటారు. 18న ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్నారు. 2016లో 51 దేశాలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖ వేదికైంది. ఈసారి జరుగుతున్న ఫ్లీట్ రివ్యూలో 70 దేశాలు పాల్గొననున్నాయి. మిత్రదేశాల నౌకా దళాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను, సమన్యయాన్ని బలోపేతం చేయడమే ‘మిలన్’ లక్ష్యం. ఈ కార్యక్రమానికి 137 దేశాలను ఆహ్వానించాయి. సమాచారం మేరకు 70 దేశాలు వరకు పాల్గొంటున్నట్లు అధికార వర్గాల తెలియజేశాయి. మిలన్ విన్యాసాలు 2 దశల్లో నిర్వహిస్తారు. తొలుత 19న హార్బర్ ఫేజ్లో అనగా తీరంలో, 21 నుంచి సీ ఫేజ్లో అనగా సముద్రంలో విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు.
ఈనెల 19న సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ నిర్వహిస్తారు. వివిధ దేశాల నౌకా దళాల కవాతు ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రపంచ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తాయి. ఈ కవాతు బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు నిర్వహిస్తారు. భారత నౌకాదళ ఫైటర్ జెట్స్, పారాచూట్లు, హెలికాప్టర్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత నౌకాదళ లేజర్ షోలు, బ్యాండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈనెల 20న ‘ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్ క్లేవ్ ఆఫ్ చీఫ్స్’ నిర్వహించనున్నారు. ఫ్లీట్ రివ్యూ, మిలాన్ల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 64 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ ఆధ్వర్యంలో 119 అభివృద్ధి, సుందరీకరణ పనులను రూ.19 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. ఆర్కే బీచ్లో ప్రధాన ప్రాంగణం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖులు, వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీక్షకులు విన్యాసాలు చూసేందుకు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఐఎఫ్ఆర్కు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆహ్వానించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్, ఐఎన్ఎస్ నీలగిరి, దిల్లీ, విశాఖ, రాజ్పుత్, శివాలిక్, ఆర్నాలా, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు 23 యుద్ధనౌకలు పాల్గొననున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేశారు.
