తగరపువలస బస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. బస్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 4 ఎకరాల భూమిని ఆర్టీసీ ఆర్.ఎం. అప్పలనాయుడితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంప్లెక్స్ తో పాటు వాణిజ్య అవసరాల దృష్ట్యా మాల్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 2016 లో శంకుస్థాపన చేసిన బస్ కాంప్లెక్స్ ఈ ప్రాంత ప్రజల కలగా అభివర్ణించారు. రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు ప్రాధాన్యమిస్తోందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో మరో 5 నెలల్లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నందున బస్ కాంప్లెక్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని వెల్లడించారు. కాంప్లెక్స్ నిర్మాణ అంచనాలు, డిజైన్ లను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఈ స్థలంలో నిర్మించిన కబేళాలో ఎలాంటి కార్యకలాపాలు జరగని కారణంగా ఇతర అవసరాలకు వాడనున్నట్టు చెప్పారు. ఇదే స్థలంలో ఉన్న ఆలయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు ఉప్పునీటి మయంగా ఉన్నాయని, తాగు నీటి విషయంలో జీవీఎంసీ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారని వివరించారు. సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందిస్తామన్నారు. జోనల్ కమిషనర్ నాగేంద్ర, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తమ్మిన సూరిబాబు, కొప్పల రమేష్, జీరు సత్యం, భువనేశ్వరి, గొలగాని నరేంద్ర, గరికిన కింగ్, పాసి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
