అవంతి మంత్రిగా ఉన్నప్పుడు గంటాపై బూతుల పురాణం
` మళ్లీ ఏకమైన రెండు గ్రూపులు
` గంటా గ్యాంగ్ కలయికతో అభిమానుల్లో సందడి
` ఈ కలయిక ఎన్నాళ్లని స్థానికుల ముచ్చట్లు
మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు…భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు మళ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరిద్దరి కలయికను చూసి ఆయా గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు. మొన్నటి వరకూ ఒకరికొకరు తిట్టుకుని సిగ్గు లేకుండా మళ్లీ ఎలా కలసి తిరుగుతున్నారంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు భోగాపురం సన్ రే రిసార్ట్స్లో లో జరిగాయి. ఈ వేడుకలకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు శారదల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో అవంతి గంటా ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. 2019లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా బయటకొచ్చి వైసీపీ జెండాతో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం పర్యాటక మంత్రిగా అవంతి శ్రీనివాసరావు పదవి పొందారు. ఆ మైకంలో గంటాను ఓ లెక్కన ఆడుకున్నారు. అప్పటి వరకూ కలసిమెలసి తిరిగిన ఈ ఇద్దరికీ ఏమైందంటూ అంతా కధలుగా చెప్పుకునే వారు. మంత్రి పదవి ఉందన్న ధీమాతో గంటాపై ఒంటి కాలిపై లేచిపోయే అవంతి కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఇప్పుడు మాజీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పుష్ప2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఆ సినీ హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లారు. దీనికి సంఘీభావం చెప్పేందుకు అల్లు అర్జున్ ఇంటికి అవంతి..గంటా కూడా వెళ్లారు. అలాగే ఇటీవల అల్లు శిరీష్ వివాహానికి ఇద్దరూ హాజరయ్యారు. అలా ఈ బంధం ఇద్దరినీ ఏకం చేస్తోంది. తాజాగా గంటా వివాహ వేడుకలోనే ఇద్దరి కలయికపై ఇరు వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. ఎప్పుడు కలిసుంటారో…ఎప్పుడు విడిపోతారో తెలీని వీరిద్దరి కోసం మనమెందుకు మనస్పర్ధలు తెచ్చుకోవాలంటూ ఒకరికొకరు అనుకున్నారు. ఒకప్పుడు గంటా గ్యాంగ్ అంటే అవంతి, పంచకర్ల, చింతలపూడి ఉండేవారు. ఇప్పుడు ఆ నలుగురు తలో దిక్కున ఉండడంతో ఎవరి అనుయాయులు వారి గూటికి చేరుకున్నారు.
