కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను తక్షణం రద్దు చేయాలని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్పులు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన సభకు సీఐటీయూ కొవ్వూరు కమిటీ కన్వీనర్ బీరా రవి అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షులు ఎం. సుందర్ బాబు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరించేవని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని దెబ్బతీసి 12 గంటల పనిని ప్రోత్సహిస్తున్నారని, శాశ్వత ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక నియామకాలకు మార్గం సుగమం చేస్తున్నారని అన్నారు. ఎంఎన్ఆర్ఈజీఎస్లో కేంద్ర వాటా తగ్గించి గ్రామీణ పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు వి. శ్రీదేవి, బి. గౌతమి, డి. అమరావతి, సి.హెచ్. భవాని, సి.హెచ్. బ్రహ్మమ్మ, బి. వసంత కనకదుర్గ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కే. నిర్మల, జి. లావణ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మైగాపుల నాగేశ్వరరావు, మద్దుకూరి దొరయ్య, మాణిక్ రెడ్డి, హరిబాబు, వర్రె సోమేశ్వరరావు, నందం కొండబాబు, మున్సిపల్ వర్కర్స్ నాయకులు భూపతి రవీందర్రావు, కళ్యాణ్, రాజేష్, పడ్డది శ్యామ్ కుమార్, మీసాల వరలక్ష్మి, మీసాల జ్యోతి, రెడ్డి వెంకటరమణ, ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్. శ్రీనివాసరావు, వి.ఎన్.వి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
