తూర్పు జోన్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తూర్పు జోన్లో పర్యటించి పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామాలయం, గాంధీనగర్ జంక్షన్, సంజయ్ గాంధీ కాలనీ–1 సచివాలయాల్లో జరుగుతున్న యు.ఎఫ్.ఎస్. కుటుంబ సర్వే పురోగతిని సమీక్షించారు. ఈ తనిఖీల సందర్భంగా పలు అంశాలపై అధికారులకు, సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు. కుటుంబ సర్వేను ఫిబ్రవరి 28 నాటికి తప్పనిసరిగా 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు సర్వే ప్రారంభించని సచివాలయ సిబ్బందిపై ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తూర్పు జోన్ పరిధిలోని కొన్ని పరిమిత ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు సహకరించకపోవడంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలు సచివాలయ సిబ్బందికి పూర్తిగా సహకరించి యునిఫైడ్ ఫ్యామిలీ కుటుంబ సర్వేను శాతం పూర్తయ్యేలా తోడ్పాటు అందించాలని, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే 48వ వార్డులో ఓట్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన సంబంధిత విభాగాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల జిల్లా కోఆర్టినేటర్ ఉషారాణి, ఎన్నికల విభాగం అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.
