10మంది ముఠా
– రూ. 3.34లక్షలు స్వాధీనం
విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను గుట్టును మహారాణిపేట పోలీసులు రట్టు చేశారు.ఈ సందర్బంగా మహారాణిపేట స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ ఈస్ట్ కొండపల్లి లక్ష్మణమూర్తి వెల్లడించారు. విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకుని నకిలీ నోట్ల చలామణికి కుట్ర పన్నిన 10 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని, వీరంతా వివిధ జిల్లాలకు చెందిన వారని ఆయన తెలిపారు.
మహారాణిపేట ఇన్స్పెక్టర్ జి. దివాకర్ యాదవ్ కి అందిన పక్కా సమాచారంతో, సోమనాధ్ మెడికల్ షాప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని ఏసీపీ పేర్కొన్నారు. జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్తున్న ఒక స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేయగా, అందులో ముగ్గురు వ్యక్తులు నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారని వెల్లడించారు. వారిని లోతుగా విచారించిన తరువాత, శరత్ థియేటర్ సమీపంలోని గీత ఇన్ లాడ్జిలో ఉన్న మరో ఏడుగురు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
వీరి వద్ద నుండి దాదాపు రూ. 37.70 లక్షల విలువైన నకిలీ నోట్లను, అలాగే రూ. 3,34,500 అసలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఒక కారు, 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన మహారాణిపేట ఇన్స్పెక్టర్, ఎస్సైలు మరియు టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందిస్తున్నట్లు కొండపల్లి లక్ష్మణమూర్తి వివరించారు.
