రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత
నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో వారికి ప్రాముఖ్యతనివ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. ధర్మవరం పట్టు చీరకు మరింత ప్రాచుర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.38 కోట్లకు పైగా నిధులతో ఏర్పాటు చేస్తున్న ధర్మవరం మెగా హ్యండ్లూమ్ క్లస్టర్ ఎనిమిది నెలల్లో ప్రారంభించనున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేయబోయే మెగా హ్యాండ్ల్యూమ్ క్లస్టర్ పై చేనేత కార్మికుల అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి పాల్గొని మంత్రి సవిత ప్రసంగించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ధర్మవరంలో రూ.38 కోట్లకు పైగా నిధులతో మెగా హ్యాండ్ల్యూమ్ క్టస్టర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ క్లస్టర్ ఏర్పాటుతో ఎనిమిది వేల మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి కలగనుందన్నారు. ధర్మవరం మెగా హ్యాండ్ల్యూమ్ క్లస్టర్ ను ఎనిమిది నెలల్లో ప్రారంభించనున్నామన్నారు. ఈ క్లస్టర్ ఏర్పాటులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాత్ర కీలకమన్నారు. ఆయన కృషి వల్లే ధర్మవరంలో మెగా హ్యాండ్ల్యూమ్ క్లస్టర్ ఏర్పాటవుతోందన్నారు.
