అరకులోయ మండలం మారుమూల మాదల గ్రామపంచాయితీ పరిధి కమలతోట గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.గ్రామంలో సుమారు 46 కుటుంబాలు ఉన్నాయని, 250 జనాభా కలిగిఉన్నమని గ్రామస్తులు కలుషితమైన బురద గెడ్డ నీరే తాగాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నపిల్లలు అనారోగ్యానికి గురై మంచాన పడుతున్నారు,ఒరిస్సా సరిహద్దు అంపవల్లి సిమెంట్ ఫ్యాక్టరీ వినియోగించిన కాలుషితం గడ్డనీరు త్రాగటం వల్ల గతంలో గ్రామస్తులు అనారోగ్యంతో రోగాల బారినపడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటిని సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగి, కొందరు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తాగునీటి వంటి ప్రాథమిక అవసరాన్ని కూడా తీర్చలేకపోతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా గ్రామానికి శాశ్వత తాగునీటి పరిష్కారం మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అభివృద్ధి మాటల్లోనే మిగిలిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో సుమారు 10 పి.వి.టి.జి కుటుంబాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క పీఎం జన్మన్ ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలుస్తోంది. అతి వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ, అవి ఇక్కడ అమలుకావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అరకులోయ మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నారు,రక్షిత మంచినీరు శాఖ అధికారులు స్పందించాలని, విద్యుత్ మోటార్ పంపు ద్వారా ఇంటింటికి మంచినీరు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాగునీటి సమస్యపై వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, పీఎం జన్మన్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, జిల్లా గృహనిర్మాణం శాఖ అధికారులకు,మంచినీటి శాఖ అధికారులకు పిర్యాదు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
