చందనోత్సవం సమీక్షలో గంటా*
సింహాచలేశుని చందనోత్సవంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. చందనోత్సవంపై మంగళవారం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో ఆయన జూమ్ ద్వారా పాల్గొన్నారు. గత ఏడాది చందనోత్సవం ముందు రోజు రాత్రి 11 గంటలకు గానీ రూ. 1,500, రూ. 1,000 టికెట్ల జారీ చేయలేదని, అలాంటి ఘటనలు పునరావృతం కానివ్వద్దని పేర్కొన్నారు. జారీ చేసే టికెట్లు కనీసం 3 రోజుల ముందు ఇవ్వగలిగితే దానికి తగ్గట్టు భక్తులు ప్రణాళికను రూపొందించుకుంటారని చెప్పారు. టికెట్ల జారీలో గందరగోళం కారణంగా డూప్లికేట్ ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. ఎక్కువ రేటు టికెట్ల కొనుగోలు చేసిన వారికి క్యూ లైన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఎన్ని టికెట్ల ప్రింట్ చేశారు.. ఎన్ని పంపిణీ చేశారు.. అనే లెక్క ఖచ్చితంగా ఉండాలని, గత ఏడాది టికెట్ల వ్యత్యాసం ఇంకా తేలలేదన్నారు. తెల్లవారుజామున తొలి దర్శనం గంట ముందు జరిగేట్టు చూస్తే భక్తులకు గంట అదనంగా స్వామి వారి నిజరూప దర్శన అవకాశం కల్పించవచ్చని వివరించారు. చందనం గట్టిగా ఉంటే తొలి దర్శనం ఆలస్యమవుతుందని అర్చకులు తెలిపారు. ఉదయం అంతరాలయ దర్శనం ఒక గంటకు పరిమితం చేయాలని.. అవసరమైతే సాయంత్రం అరగంట పునరుద్ధరించ వచ్చన్నారు. పూర్తి స్థాయి ఈఓ ఉన్నందున ఈసారి చందనోత్సవం సమర్థంగా నిర్వహించాలని చెప్పారు.
