మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను సమాజంలో నెలకొల్పిన మహనీయుడని కొనియాడారు. 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో జన్మించిన సంజీవయ్య గారు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యా విస్తరణకు ఆయన కృషి చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం బొమ్మూరు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి ఘయాజుద్దీన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, ఏఎస్వో ఎస్. సత్యనారాయణ, స్థానిక నాయకులు జార్జి అందోని, ఠాగూర్, వసతి గృహ ఉపాధ్యాయులు, విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
