ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఖండన
రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు సంబంధించి ఒక దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సీఎంఆర్ విషయంలో రాష్ట్ర మంత్రులతో మిల్లర్లు కమిషన్ల కోసం బేరసారాలు కుదుర్చుకున్నారంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్య ప్రకాశరావులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ పత్రిక తమకు అనుబంధంగా ఉన్న ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే దురుద్దేశంతోనే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలతో కథనాన్ని ప్రచురించిందని వారు ఆరోపించారు.
రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు*
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎవరితోనూ ఎటువంటి బేరసారాలు గానీ, కమిషన్ ఫిక్సింగ్లు గానీ జరపలేదని, మిల్లర్ల మీద ఎవరి ఒత్తిడి లేదని వారు స్పష్టం చేశారు.రైస్ మిల్లర్ల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా ఇటువంటి కథనాలు రాయడం తగదని హితవు పలికారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బియ్యం సేకరణకు సంబంధించిన సమస్యలను అధికారులతోనూ, ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి పరిష్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమ అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తుందని, కేవలం రైతుల సంక్షేమం, మిల్లర్ల ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు సహకరించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
