భారీ మొత్తంలో గంజాయి, హాషిష్ ఆయిల్ నిర్వీర్యం.
గంజాయి జోలికి వెళ్లేవారిని సంఘవిద్రోహశక్తులుగా పరిగణన.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
మధురవాడ, జయ జయహే:
విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 529 కేసులలో పట్టుబడిన భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను ఆదివారం ఉదయం జీవిఎంసీ 5వార్డు పరిధిలో వున్న కాపులుప్పాడ డంపింగ్ యార్డులో పోలీసులు పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 5,21,12,425/- (ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు) విలువ చేసే ఈ గంజాయి గుట్టలను నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా కాల్చివేశారు.

ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల వివరాలు: గంజాయి: 10,147.590 కేజీలు,హాషిష్ ఆయిల్: 19.31 లీటర్లు, ఓపియం:1 కేజీ,గంజాయి దహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ (సీపీ) శంఖభ్రత భాగ్చి,జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధీర ప్రసాద్, ఐ.జి.రవి కృష్ణ హాజరయ్యారు.
నగరంలో గంజాయి నియంత్రణ మరియు అక్రమ రవాణాపై పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగంగా పట్టుబడిన ఈ భారీ మొత్తాన్ని బహిరంగంగా కాల్చివేయడం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనపై తమ నిబద్ధతను పోలీసులు మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మరియు సీపీ మాట్లాడుతూ గంజాయి రవాణా,విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.2024 తర్వాత అల్లూరి జిల్లాలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామన్నారు. ఇటీవల వచ్చిన సాటిల్లెట్ సర్వే ద్వారా పరిశీలించామని తద్వారా గంజా జీరో పంటగా ప్రకటించే అవకాశం ఉందన్నారు.ప్రజలు స్వచ్ఛందంగా గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ జోన్ల ఏసీపీలు,సీఐలు, ఎస్ఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
