రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్
రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
రెండు దశాబ్దాలకు పైగా గడిచినా సినీనటి ప్రత్యూష హత్య కేసులోనూ, విద్యార్థిని అయేషా మీరా దారుణ హత్య కేసులోనూ నేరస్తులు శిక్షించబడకపోవడం బాధాకరమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుగాలి ప్రీతి ఘటనను కూడా ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరగలేదని అన్నారు.
ప్రత్యూషా కేసులో పోస్టుమార్టం నివేదికలో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించిన నేపథ్యంలో, ఆ నివేదికకు బాధ్యులైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విచారణలో సంబంధం లేని సెక్షన్లు చేర్చడం, దర్యాప్తు లోపాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు కేసు బలహీనపడటానికి కారణమయ్యాయా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
అయేషా మీరా కేసులోనూ నిజమైన నేరస్తులు శిక్షించబడలేదన్న భావన సమాజంలో బలపడుతోందన్నారు. తీర్పులు వెలువడుతున్నా, బాధిత తల్లుల హృదయ వేదనకు మాత్రం ముగింపు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మానవత్వంతో స్పందించి, పెండింగ్లో ఉన్న అనుమానాలపై సమగ్ర పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
“దేశంలో చట్టాలు నిజంగా ఎవరి కోసం పనిచేస్తున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల మౌనం, భయాలు, బలహీనతలే ఇలాంటి దురాగతాలకు కారణం” అని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు ఓటర్లుగా మాత్రమే కాక, మనుషులుగా ఆలోచించి న్యాయం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.
ప్రత్యూషా–అయేషా మీరా–సుగాలి ప్రీతి కేసులు: న్యాయం ఎప్పుడు?
RELATED ARTICLES
