ఫిర్యాదు చేస్తే బెదిరింపులే?! రాజమండ్రి నగరంలోని సింహాచలం నగర్లో మౌలిక వసతుల సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, కొందరి అక్రమాలకు అండదండలతో తాగునీటి దోపిడీ బహిరంగంగానే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచే అక్రమ మోటార్ పంపుల ద్వారా మున్సిపాలిటీ నీటిని ట్యాంకులకు మళ్లించడంతో వందలాది కుటుంబాలకు తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అదే సమయంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. డ్రైనేజీ కాలువలను మూసివేస్తూ అక్రమ కట్టడాలు చేపట్టడంతో మురికినీరు వీధుల్లో నిలిచిపోతోంది. దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు అనారోగ్య భయాలతో జీవిస్తున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన మున్సిపల్ సిబ్బంది కళ్లుమూసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమస్యలపై ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని, ఫిర్యాదు చేసిన వివరాలు బయటకు వెళ్తున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పన్నులు కడుతున్నా కనీస సౌకర్యాలు లభించడంలేదని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సింహాచలం నగర్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ మోటార్లు, మూసేసిన డ్రైన్లు
RELATED ARTICLES
