భర్తను ప్రియుడుతో కలసి హత్య చేసిన భార్య,హిట్ అండ్ రన్ అంటూ మాయ మాటలు,పెళ్లైన మూడు నెలలకే అఘాయిత్యం,పోలీసుల దర్యాప్తులో హత్యగా నిర్థారణ,అంకిత్ అనే వ్యక్తి తన భార్యతో వాకింగ్ కు వెళ్లాడు. కానీ దారిలో ప్రమాదానికి గురై చనిపోయాడు. ఓ వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ భార్య తన పసుపు, కుంకుమలు చెరిగిపోయాయని రోదించారు. కానీ తర్వాత తెలిసిందేమిటంటే.. ఆమె తన భర్తను ప్లాన్ చేసి.. హిట్ అండ్ రన్ ద్వారా హత్య చేయించింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుడు అంకిత్ కు అదే ప్రాంతానికి చెందిన షాలిని తో కేవలం మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, పెళ్లికి ముందే షాలినికి అక్షిత్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన షాలిని, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని తన ప్రియుడు అక్షిత్తో కలిసి పక్కా స్కెచ్ వేసింది. పథకం ప్రకారం, అంకిత్ను ఓ రోజు.. వాకింగ్ కు తీసుకెళ్లింది. రోడ్డుపై వెళ్తుండగా వాహనంతో బలంగా ఢీకొట్టి చంపేశారు. అది కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదం అని అందరూ నమ్మేలా సీన్ క్రియేట్ చేశారు. ప్రాథమికంగా ఇది ప్రమాదమని భావించినప్పటికీ, మృతుడి కుటుంబ సభ్యుల అనుమానం , పోలీసుల లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. అంకిత్ మరణించిన సమయంలో షాలిని, ఆమె ప్రియుడి ఫోన్ లొకేషన్లు, కాల్ డేటాను విశ్లేషించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ముజఫర్నగర్ పోలీసులు ఈ కేసులో సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలు షాలిని, ఆమె ప్రియుడు అక్షిత్ తో పాటు, ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే అంకిత్ను చంపినట్లు వారు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు వాడిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు ముళ్ల బంధాన్ని గౌరవించకుండా, కట్టుకున్న వాడిని కాలయముడిలా మారి హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేవలం మూడు నెలల వైవాహిక జీవితాన్ని బలితీసుకున్న ఈ ముఠాకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
