వి.ఎం.ఆర్.డి.ఎ. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తో కలిసి మాస్టర్ ప్లాన్ రోడ్లు, వాటి కనెక్టివిటీ గురించి ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. భోగాపురం ఎయిర్ పోర్టు మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మొదటి దశలో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న 7 మాస్టర్ ప్లాన్ రోడ్ల పురోగతిని అధికారుల నుంచి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు గ్రామాల నుంచి ఉన్న ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు స్థితిగతులు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. ఆనందపురం జంక్షన్ లో నేషనల్ హైవే కు అనుసంధానం చేసేలా ఫ్లయ్ ఓవర్ నిర్మాణం వల్ల ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించే వారు మరింత వేగంగా గమ్యం చేరే వీలుంటుందని తెలిపారు. అలాగే అడివివరం నుంచి సత్తరువు జంక్షన్ వరకు రోడ్డు విస్తరిస్తున్నందున హైవే కు అనుసంధానం చేసేలా ఫ్లయ్ ఓవర్ నిర్మిస్తే వాహన చోదకులకు సమయం కలిసి వస్తుందన్నారు. భూ నిర్వాసితులకు త్వరితగతిన టీడీఆర్ లు అందజేయాలని చెప్పారు. అభ్యంతరాలుంటే ఆయా స్థల యజమానులతో మాట్లాడి పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. కోస్టల్ కారిడార్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరారు. వి.ఎం.ఆర్.డి.ఎ. అదనపు కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.
