రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యాచరణ
* కాలువలు, చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు
నీటితోనే సంపద సృష్టించొచ్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకనే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కలిసి వంద రోజుల ప్రణాళికలను రూపొందించారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామం సమీపంలోని చెరువులో సోమవారం ఏర్పాటు చేసిన జలధార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణకు పెద్ద ఎత్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణకు 100 రోజుల పాటు జలధార ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యాచరణ ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలతో ప్రతి ఎకరాకూ సాగునీరందించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలతో పాటు మరమ్మతులు, ఇంకుడు గుంతలు తవ్వుతామన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచడం, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విధానాన్ని (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించడం, చెరువుల్లోని మట్టిని పొలాలకు తరలించడం, పంట కుంటల నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నీటి సంరక్షణను ఉద్యమం చేపట్టామని, రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ ఉద్యమం చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.
