పార్టీ సరే.. మహానుభావుడి విగ్రహం ఎక్కడా..!
ఎన్టీఆర్ విగ్రహానికి సుముహూర్తం ఇంకా కుదరలేదా ..?
తెలుగుదేశం వ్యవస్థాపకుడు తెలుగు తమ్ముళ్లకు ఆరాధ్య దైవమైన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం లేక మండల కేంద్రం విలవిల్లాడుతుంది. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు .అన్న సూత్రంతో పేదలకు మెరుగైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా మహిళలకు సమాన హక్కులను కల్పించి అభ్యుదయవాదిగా నిలిచిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. అంతటి మహానుభావుడుకి నేటికీ కూడా విగ్రహం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఓజిలి మండల కేంద్రం ఉందంటే నమ్మశక్యం కావడం లేదు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటల ఉన్న ఓజిలి మండల కేంద్రం ఎన్టీఆర్ విగ్రహం లేక చిన్న బుచ్చి పోయింది. ఎన్టీఆర్ వర్ధంతి , జయంతి సందర్భంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించే చేతులు దులుపుకుంటున్నారే తప్ప తెలుగు తమ్ముళ్లకు , తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్టీఆర్ శాశ్వత విగ్రహం ఏర్పాటు చేయాలని ఆలోచన లేకపోవడం శోచనీయంగా మారింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్. సామాన్యుడికి, పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన మృతి చెంది దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతటి మహోన్నత వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నాయకులు , పార్టీ కార్యకర్తలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఓజిలిలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరంగా మారిందని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీని స్థానిక టిడిపి నాయకుడు దశాబ్దాల నుంచి నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడం విస్మరించారు. ఇప్పుడున్న టిడిపి నాయకులైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని ఎన్టీఆర్ అభిమానులు ఆశ ఊహల్లో ఎదురుచూస్తున్నారు.
