మొంథా తుఫాను తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కల్యాణ్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తుఫాను అనంతర ఉపశమన చర్యలపై అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలని పకడ్బందీగా రూపొందించాలని మార్గనిర్దేశం చేశారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత పరిస్థితిపై ఆరా తీశారు పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక రచించాలని సూచించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలని ఆదేశించారు. ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

