నగర మేయర్ పీలా శ్రీనివాసరావు .
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలోని మాధవధార మారియట్ హోటల్ జంక్షన్ ఎన్ జి జి వో ఎస్ కాలనీ, నరసింహనగర్, ఏ ఎస్ ఆర్ నగర్, సీతమ్మధార గిరి ప్రదర్శన రోడ్డు తదితర ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు జీవీఎంసీ నుండి సుమారు రూ.30.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి. విష్ణుకుమార్ రాజు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని, 2026 – 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు భారీ స్థాయిలో నిధులు కేటాయించారని, అలాగే 530 పైగా ప్రధాన ప్రాజెక్టులు, 15 కోట్లతో మెట్రో రైలు, అలాగే అన్ని వర్గాలకు సంక్షేమానికి భారీ స్థాయిలో నిధులు కేటాయింపు జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వముతోనే రాష్ట్ర అభివృద్ధితోపాటు విశాఖ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విశాఖ నార్త్ జోన్ అభివృద్ధికి శాసనసభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారని అలాగే సుమారు 30 కోట్ల రూపాయలతో సీతమ్మధార గిరి ప్రదర్శన రోడ్డు అభివృద్ధికి, మారియట్ హోటల్ జంక్షన్ నుండి ఎన్ జి జి ఓ కాలనీ వరకు, నరసింహ నగర్ జంక్షన్, ఏ ఎస్ ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో వి ఆర్ సి సి ఎస్ డబ్ల్యు కాలువలు, కల్వర్టు స్లాబ్, ఫుట్ పాత్ టైల్స్, తారు రోడ్డు నిర్మాణాలు మొదలైన పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, విశాఖ ప్రపంచ స్థాయిని ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 30 కోట్ల రూపాయలతో నార్త్ జోన్ అభివృద్ధికి నేడు శ్రీకారం చుట్టామని అలాగే ఉత్తర నియోజకవర్గం లో పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో సుమారు 28 వేల కోట్లు విశాఖ నగరానికి కేటాయింపు చేయడమైనదన్నారు.
డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్టాభిరామ్, బిజెపి ఫ్లోర్ లీడర్ 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత, కార్పొరేటర్లు అల్లు శంకర్, వి. ప్రసాద్, అనిల్ కుమార్ రాజు,రెయ్యి వెంకటరమణ, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు ప్రవీణ్, కార్యనిర్వహక ఇంజనీరు పద్మావతి, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ భరణి, ఇతర నాయకులు నజీర్, ఉషా కిరణ్, సురేష్ బాబు, శ్యామల దీపికా తదితరులు పాల్గొన్నారు.
