రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత*
చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఆంధ్రప్రదేశ్ పద్మశాళి సంఘ ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 26న నిర్వహించే పద్మ శాలీ మహాసభకు హాజరుకావాలని ఆ సంఘ ప్రతినిధులు మంత్రి సవితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేతలకు కూటమి ప్రభుత్వంతోనే మేలు జరుగుతోందన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తున్నామన్నారు. నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తున్నామన్నారు. నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా మెగా క్లస్టర్లు, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. . 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందజేశారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించామన్నారు. నేతన్నల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. నేతన్నలు గౌరవ ప్రద జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు మంత్రి సవిత..పద్మ శాలీ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, ఇతర ప్రతినిధులు మునగపాటి వెంకటేశ్వరరావు, అంజిబాబు, విజయనాగేంద్ర, బండారు బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
