వైయస్సార్సీపీ నేతల భార్యలను కించపరిస్తే.. ముఖ్యమంత్రి మద్దతా?
– పవన్ కళ్యాణ్.. నాడు మీరు ఇదే ఆంధ్రజ్యోతి వద్ద ధర్నా చేయలేదా?
– శాంతియుత నిరసన చేస్తే ‘రౌడీ మూకలు’ అంటారా?
– అసభ్యకర వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
– భార్యకు, సోదరికి తేడా తెలియని భాషతో పత్రికా అరాచకమా?
` మండిపడ్డ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైయస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయలేక నేతల భార్యలను, కించపరిచేలా ‘వీకెండ్ కామెంట్స’ రాయడం జుగుప్సాకరమని ధ్వజమెత్తారు. ఈ నీచపు రాతలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైయస్సార్సీపీ కార్యకర్తలను ‘రౌడీ మూకలు’ అని సంబోధిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు రాధాకృష్ణ అరాచకానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని విమర్శించారు. ‘మీ ఇంటి వరకు వస్తే ఒక నీతి.. పక్కింటికి వస్తే మరో నీతా?’ అని ప్రశ్నిస్తూ, గతంలో ఇదే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు అమరావతిలో జరుగుతున్న అంతులేని దోపిడీ మరోవైపు విశాఖలో రూ.5 వేల కోట్ల భూదోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స’ చేస్తున్నారని, రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.” ఇందుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే…
` కుటుంబాలపై దాడులా? ఇదేనా మీ సంస్కృతి?
రాజధానిపై జగన్ చేసిన ‘మావిగన’ ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయస్సార్సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ. “భార్యకు, సోదరికి మధ్య తేడా తెలియని భాషతో రాధాకృష్ణ అరాచకం సృష్టిస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలను రౌడీలని ప్రస్తావించడం శోచనీయం”.
– అమరావతి పేరుతో భారీ దోపిడీ — డైవర్షన్ పాలిటిక్స్…!
వైయస్సార్సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. చదరపు అడుగుకు రూ. 14 వేల ఖర్చు చూపిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. అమరావతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఆ పేరుతో చేస్తున్న అధికార పార్టీ దోపిడీకి మాత్రమే మా పార్టీ వ్యతిరేకం. అమరావతిలో నిర్మాణాలు త్వరిత గతిన చేపట్టాలనే మేం కోరుతున్నాం. కానీ వాస్తవానికి అవేవీ జరగడం లేదు. రాజధానిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేస్తున్న చర్యలని ప్రజలు అనుమానిస్తున్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు కుటుంబ సభ్యులే రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారని, దీనిపై సమాధానం చెప్పలేకే ఇలాంటి నీచపు రాతలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
– క్షమాపణ చెప్పాల్సిందే..
కూటమి ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదరదు. 40 శాతం ఓటు షేర్ ఉన్న పార్టీపై బుల్డోజింగ్ పాలిటిక్స్ సాగవు. రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో సమాధానం చెప్పాలి” అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ , విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు పాల్గొన్నారు.
