ఈతకు కెళ్ళి ప్రమాదవశాత్తు మట్టి బావిలో మునిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికులను కలచివేసింది. సంఘటనపై ఓజిలి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు శ్రీకాళహస్తి పట్నంలోని ఎం.ఎం. పేటకు చెందిన ముద్దు. సాయి ( సం’ 24) ఓజిలి మండలంలోని కారూరు గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసి వెళ్దామని కారూరు గ్రామానికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి కారూరులోని ఒక పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లిన ముద్దు సాయి ప్రమాదవశాత్తు బావిలోని బురదలో చిక్కుకుపోవడంతో శనివారం అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఆదివారం ఉదయం నీటి మోటార్ల ద్వారా నీటిని తోడి మృతదేహాన్ని వెలికితీశామన్నారు. మృతుడికి వివాహం అయ్యి భార్య కూడా ఉందన్నారు . మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ పేర్కొన్నారు.
